Menu

Pages

Saturday, 1 June 2019

జాతీయవాదం, దేశభక్తికి బిజెపిని బ్రాండ్ అంబాసిడర్ గా మారుస్తున్నదెవరు..?


Nationalism, Patriotism credits going to BJP article by Srinivas Gundoju
రాజకీయ చదరంగంలో అడుగు పెట్టాక రాజకీయ పార్టీల మధ్య అధికార దాహంతో వ్యూహ ప్రతి వ్యూహాలు తప్ప ప్రజా శ్రేయస్సు, సర్వమత సమానత్వం, నిజమైన లౌకిక వాదం ఉండవనేది ప్రజలు తెలుసుకోవాల్సిన చేదు నిజం..  కొందరు లౌకిక వాదం మాటున హిందూ మతాన్ని టార్గెట్ చేసి దూషిస్తే, మరికొందరు టెర్రరిజం పేరుతో ముస్లిం మతాన్ని దూషించటం, హిందూ ముస్లిం ఓట్ల వేటలో హిందూ ముస్లిం ప్రజల మధ్య ఎప్పటికీ ఆరని రావణ కాష్టానికి ఆజ్యం పోస్తూ చలి కాచుకోవడమే తప్ప ఆయా మతాలకు చెందిన ప్రజలపై ప్రేమానురాగాలు కనబరచడం మాత్రం కాదని ఎరుగాలి.  నిజమైన లౌకిక వాది ఉగ్రవాదాన్ని ఒక మతానికి ముడి పెట్టి చూడడు, అలాగే ఒక మత విశ్వాసాలను, మత దేవతా మూర్తులను కించపరుస్తూ వ్యాఖ్యలు చేయడని అన్ని మతాల ప్రజలు గ్రహించాలి.

బిజెపికి ఇతర పార్టీలు గత కొన్ని దశాబ్దాలుగా మతతత్వ పార్టీ, హిందూమత పార్టీ అనే ముద్రను వేస్తూ బిజెపిని ఎన్నికల రణరంగంలో ఎదుర్కొంటూ వస్తున్నాయి.  నిజానికి ఐదు సంవత్సరాల ముందు వరకు బిజెపికి హిందూ పక్షపాత పార్టీ, మతతత్వ పార్టీ అనే టాగ్ లైన్ పెద్ద అవరోధంగానే పరిణమించేదని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడ్డారు.  ఇతర పార్టీలు తమ పార్టీ పై మతతత్వ పార్టీగా ముద్ర వేస్తున్నప్పటికీ ఎన్నికలలో గెలుపోటములతో సంబంధం లేకుండా.. ఓటు బ్యాంకు రాజకీయాలకు తావివ్వకుండా ముస్లిం ఓట్ల కోసమో, మరే ఇతర మతాలకు చెందిన ప్రజల ఓట్ల కోసమో తమ సిద్ధాంతాలకు తిలోదకాలు ఇవ్వకుండా చావైనా రేవైనా తాము నమ్మిన సిద్ధాంతాలతోనే కొనసాగుతున్న భారతీయ జనతా పార్టీకి మతతత్వమనే అవరోధంతో గతంలో పలు వ్యతిరేక ఫలితాలను చవిచూసినప్పటికీ ముందుకు సాగుతూనే వచ్చింది.  మతతత్వ పార్టీగా ముద్రింపబడిన బిజెపితో పొత్తు పెట్టుకోవాలంటే తమ పార్టీని కూడా మతతత్వ పార్టీగా పరిగణిస్తారేమోననే సందేహంతో ఇతర పార్టీల వారు బిజెపితో పొత్తుకు సంశయించేవారు.  కాలం గడుస్తున్నకొద్దీ.. ఏదైతే హిందూ మత పార్టీ అనే ముద్ర బిజెపికి అవరోధమని విశ్లేషకులు సైతం భావించారో అదే ముద్ర ప్రస్తుతం అనుకూల అంశంగా బిజెపికి తోడ్పడుతోందనేది గమనించాల్సిన విషయం.  బిజెపికి హిందూ మత ప్రజల ఓటు బ్యాంకు తోపాటు ఈ మధ్యనే మతాలతో సంబంధం లేకుండా అన్ని మతాలు సమర్ధించే జాతీయ వాదాన్ని కూడా బిజెపి తన పేటెంట్ రైట్ గా పొందుతోంది.  కలిసొచ్చే కాలమొస్తే నడిసొచ్చే కొడుకు పుడతాడన్నట్లుగా బిజెపికి హిందుత్వంతో పాటు దేశ భక్తి, జాతీయవాదం కూడా తోడై భారతదేశంలో తిరుగులేని అతి పెద్ద పార్టీగా ప్రస్తుతం అవతరించింది. 
కానీ జాతీయవాదం, హిందుత్వం, దేశభక్తి అంశాలకు పేటెంట్ హక్కులను బిజెపి తమకు తాముగా మాత్రం పొందలేదని కొంత విశ్లేషిస్తే అవగతమవుతోంది.  దేశంలో అధిక జనాభా కలిగిన అతి పెద్ద మతం హిందూ మతం.  ఈ మత ప్రజలలో బిజెపిని హిందుత్వ పార్టీగా గుర్తింపు పొందేలా చేసింది బిజెపియేతర పార్టీల నాయకులే..!!  బిజెపిని ఇరుకున పెట్టేందుకు బిజెపి అండగా నిలుస్తోన్న హిందూ మతం పై, ఆ మత విశ్వాసాలపై, హిందూ మత దేవతా మూర్తులపై కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తూ బిజెపిని ఎదుర్కొనే వ్యూహం బిజెపియేతర పార్టీలు చేయడంమే బిజెపి హిందువులను అతి చేరువ అయ్యేలా చేసింది.  ఈ క్రమంలో లౌకిక వాద ముసుగులో కమ్యూనిస్ట్, కాంగ్రెస్ ఇతర పార్టీల నాయకులు హిందూ మతస్థులు దేవతలుగా భావించే దేవతా మూర్తులపై, హిందూ మత విశ్వాసాలపై  తీవ్ర విమర్శలు గుప్పించడం అందుకు కౌంటర్ గా బిజెపి నాయకులు (హిందూ మతం తరుపున) ప్రతి విమర్శలు చేయడం, నిరసన ప్రదర్శనలు చేయడం హిందూ మత ప్రజలకు బిజెపిని అతి చేరువ చేసింది.  బిజెపిని విమర్శించాలనుకునే ఇతర పార్టీల నాయకులు బిజెపి అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కాకుండా హిందూ మతాన్ని, ఆ మత విశ్వాసాలను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించడంతో తమకు తెలియకుండానే హిందూ మత ప్రజల విశ్వాసం బిజెపి పొందేలా, హిందుత్వంకు బిజెపి బ్రాండ్ గా మారేలా చేయడం జరిగింది.  హిందూ మతాన్ని విమర్శించడం ద్వారా ఇతర పార్టీల నాయకులు బిజెపికి నష్టం చేయకపోగా అత్యధిక ఓటు బ్యాంకు గల మత ప్రజలను బిజెపికి పేటెంట్ గా నిలిచేలా చేశాయి.  అందుకు ఉదాహరణ గా ఇటీవలే తెలంగాణలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఒక భహిరంగ సభ వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన "హిందూ గాన్లు.. హిందూ గాన్లు.." అనే వ్యాఖ్య హిందూ మత ప్రజలలో తీవ్ర అసహనానికి గురి చేసింది, అందుకు హిందువుల తరుపున మద్దతుగా బిజెపి నిలిచి తెరాస పై విమర్శలు గుప్పించడంతో తెలంగాణాలో బిజెపికి మోడీ మానియాతో పాటు మెజారిటీ హిందువుల ఓటు బ్యాంకు చెందేలా చేసింది.  ఫలితంగా తెలంగాణాలో చెప్పుకోదగిన ఓటు బ్యాంకు లేని బిజెపికి నాలుగు ఎంపీ స్థానాల విజయంతో గ్రాండ్ గా తన ఖాతా తెరిచినట్లైంది.

ఇకపోతే జాతీయవాదం, దేశ భక్తి అంశాలు కూడా బిజెపికి పేటెంట్ గా లభించేలా చేసింది కూడా విపక్ష పార్టీలే కావడం విశేషం..!!  అందుకు ఉదాహరణలుగా గడచిన ఐదేళ్లలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు మోడీ అవలంభించిన ప్రజా వ్యతిరేక విధానాల పట్ల చెప్పుకోదగినట్లుగా విమర్శించని విపక్ష పార్టీలు.  నరేంద్ర మోడీ నాయకత్వంలో మొదట జరిగిన సర్జికల్ స్ట్రైక్ పై అనుమానాలను వ్యక్తపరుస్తూ, దేశంలో ఉగ్ర దాడులకు ప్రయత్నించిన కసబ్ లాంటి ఉగ్రవాదుల మరణ శిక్ష, ఉగ్రవాద సానుభూతిపరుడైన యాకుబ్ మెమెన్ మరణ శిక్ష పై కూడా సానుభూతి వ్యక్తం చేయడం, యూనివర్సిటీ లలో విద్యార్థి సంఘాల మాటున ఉగ్రవాద కార్యకలాపాలకు ఊతమిచ్చే విధంగా యువతను ప్రక్కదోవ పట్టించే వారికి మద్దతు తెలపడం, ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వ విధానాలను తప్పుపట్టడం, ఫలితంగా బిజెపి దేశభక్తి రాగం ఆలపించి జాతీయవాదాన్ని తమకనుకూలంగా మలుచుకొనే ప్రయత్నం చేయడం బిజెపిని దేశభక్తి, జాతీయవాదంగల ప్రజలకు చేరువ చేసింది.  అలాగే ఈ మధ్యనే జరిగిన పుల్వామా దాడి పట్ల చనిపోయిన సైనికులకు నివాళులు అర్పించడంలో అంతగా కనబరచని శ్రద్ధ ఆ దాడి పాకిస్థాన్ చేసి ఉండదని శత్రు దేశాన్ని వెనకేసుకురావడంలో కనబర్చడం విపక్షాల తీరును తేటతెల్లం చేశాయి.  పుల్వామా ఉగ్రదాడికి సమాధానంగా భారత ప్రభుత్వం వారం రోజులలోపే పాక్ ఉగ్ర స్థావరాలపై భారత వాయుసేన చే జరిపిన రెండో సర్జికల్ స్ట్రైక్ తో సుమారు 300 పైగా ఉగ్ర మూకలను హతమార్చి, అంతర్జాతీయ మీడియా సైతం ధృవీకరిస్తే.. సర్జికల్ స్ట్రైక్ జరిగిందని గ్యారంటీ ఏంటి..? మాకు ఆధారాలు చూపాలి..!! అని తృణమూల్ నేత మమతా అండ్ కో, కాంగ్రెస్ నాయకులు, ఆమ్ ఆద్మీ నాయకులు కేజ్రీ వాల్, తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు సైతం అనుమానాలు వెలిబుచ్చడంతో జాతీయవాదులకు విపక్షాలు దూరమవుతూనే బిజెపి దగ్గరయ్యేలా చేశాయి.. పాక్ మిలిటరీకి చిక్కిన మన భారత వాయుసేన ఉన్నతాధికారి అభినందన్ ను ఒకే ఒక్క స్టేట్మెంట్ (అభినందన్ పాక్ బందీలో వారం రోజులకు మించి ఉన్నట్లయితే యుద్ధం అమలులో ఉందని భావించాల్సి వస్తుందని ప్రధాని వ్యాఖ్యానించడం)తో అభినందన్ ను క్షేమంగా వారం రోజుల లోపే ఇండియా కు పాక్ ప్రతినిధులు అప్పగించడం దాని పై కూడా విపక్ష పార్టీలు ఆ ఘనత అంతా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దే అన్నట్లుగా, ఆయన శాంతి కాముకుడు కాబట్టే మన వాయుసేన ఉన్నతాధికారి అభినందన్ ను ప్రాణాలతో ఇండియాకు అప్పగించారని వ్యాఖ్యలు చేయడం.. ఇంచు మించు పోర్న్ వీడియో లకు సరి సాటిలా ఉండే ముద్దు, సెక్స్ సీన్లు సినిమాలలో ప్రదర్శించినప్పటికీ అభ్యంతరం తెలుపని వారు, జాతీయ గీతాన్ని సినిమా హాళ్లలో ప్రదర్శించడాన్ని వ్యతిరేకించడం.. పాక్ ఉగ్రవాదాన్ని వెనకేసుకురావడం అదే స్థానంలో హిందుత్వాన్ని ఉగ్రవాదంతో పోల్చడం.. మొదలగు విపక్షాల వైఖరి బిజెపికి చేటు చేయలేకపోగా జాతీయతావాదం, దేశ భక్తి కలిగిన పార్టీగా అత్యధిక దేశ ప్రజలు బిజెపిని గుర్తించే విధంగా చేశాయి.  ఇందుకు నిరూపణగా ఎప్పుడు లేని విధంగా 8% ముస్లిం ఓట్లు సైతం ఈ ఎన్నికల్లో బిజెపి కైవసం చేసుకున్నట్లు సి.యన్.డి.ఎస్. కంపెనీ నిర్వహించిన సర్వే రిపోర్ట్ లో తేటతెల్లమైంది. 
బిజెపిని ఇరుకున పెట్టాలనుకునే విపక్ష పార్టీలు బిజెపి అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పూర్తి స్థాయిలో దృష్టిని కేంద్రీకరించకుండా, హిందుత్వం, జాతీయవాదం, దేశభక్తి అంశాల పై ఎక్కువ విమర్శలు ఎక్కుపెట్టడం మూలాన బిజెపికి చేటు చేయలేకపోగా దేశంలో ఇప్పటికే పేటెంట్ రైట్ కలిగి ఉన్న హిందుత్వంతో పాటు జాతీయవాదం, దేశభక్తి అంశాలకు బిజెపి పూర్తి స్థాయిలో బ్రాండ్ అంబాసిడర్ గా మారి, పేటెంట్ రైట్ కలిగి ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.  రాజకీయంలో ప్రత్యర్థి పార్టీని ఎదుర్కోవాలనే తలంపు సమర్థనీయమే అయినప్పటికీ ఎంచుకోవాల్సి దారి విషయంలో ఒకటికి పది సార్లు ఆచి తూచి ఆలోచించి ఎంచుకోవాలనేది బిజెపి అభివృద్ధికి దోహదపడిన విపక్ష పార్టీల విధానాలు చూస్తే అవగతమవుతోంది.  ఇకనైనా అదనపు ఓటు బ్యాంకును శత్రు పార్టీకి అప్పజెప్పే వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా ప్రజా శ్రేయస్సుకు దోహదపడే అంశాలను లేవనెత్తుతూ, అధికార పార్టీ అవలంభించే ప్రజా వ్యతిరేఖ విధానాలను ప్రజా క్షేత్రంలో ఎండగట్టుతూ బిజెపియేతర పార్టీలు తమ ఉనికిని కాపాడుకుంటామని ఆశిద్దాం.



Tags: narendra, modi, bjp, mody, mamata, benarji, rahul, gandhi, congress, tdp, trs, kcr, cbn, andhra, pradesh, politics, updates, latest, news, india, political, analysis, srinivas, gundoju, article, telugu, bjp

Friday, 31 May 2019

2019 ఎన్నికల ఫలితాలు రాజకీయ పార్టీలకు నేర్పిన పాఠాలేంటి?


ఈ మధ్యనే జరిగిన పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కేంద్రంలో బిజెపి, కాంగ్రెస్ మధ్య ఆసక్తికర పోరు జరిగి వన్ సైడ్ వార్ గా ముగిసాయి.  ఇంతకీ ఈ ఎన్నికల ఫలితాలు ఏ ఏ పార్టీకి ఎలాంటి గుణపాఠాలు నేర్పాయి?  ఈ ఫలితాలను ముందస్తుగానే తెలంగాణ సీఎం అంచనా వేసారా?  అందుకే ముందస్తుగా అసెంబ్లీ ఎన్నికలకు తెరలేపి తన పని తాను శీగ్రంగా కానిచ్చేసుకున్నారా?  అనే ప్రశ్నలకు అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. 
ఈ ఎన్నికలకు ముందు వెలువడిన సర్వే రిపోర్ట్ లు కూడా సందిగ్ధంగా ఉండటంతో వెలువడబోయే ఫలితాలను కొందరు బిజెపికి అనుకూలంగా, మరికొందరు కాంగ్రెస్ కు అనుకూలంగా అంచనా వేసి వ్యూహాలు అమలు చేస్తూ ఎన్నికల క్షేత్రంలో పాల్గొన్నారు.  కొన్ని సర్వేలు కేంద్రంలో ఏ పార్టీకి సరైన మెజారిటీ రాకపోవచ్చుననే అంచనా తెలుపడంతో దేశంలోని ప్రాంతీయ పార్టీలు కేంద్రంలో చక్రం తిప్పే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఉద్దేశంతో ఎన్నికలకు ముందే ప్రాంతీయ పార్టీల నేతలు ఏకమయ్యే చర్యలకు పూనుకున్నారు కూడా.  కానీ వెలువడిన ఫలితాలు ప్రాంతీయ పార్టీల నేతల ఆశలపై నీళ్లు చల్లేసాయి.  బహుశా ఈ ఎన్నికల్లో మోడీ హావా ఎంతో కొంత ఉంటుందని కేసీఆర్ ముందస్తుగానే గ్రహించి ఉంటాడు అందుకే సమయం మిగిలి ఉన్నప్పటికీ ముందస్తుగా తన పని తాను కానిచ్చేసి మళ్ళీ రాష్ట్రంలో అధికారంలోకి రాగలిగారని విశ్లేషకులు భావిస్తున్నారు.  అయితే కేద్రంలో హంగ్ వస్తుందనే కొంత ఆశాభావంతో కేసీఆర్ కేంద్రంలో చక్రం తిప్పే వ్యూహంతో 16 ఎంపీ సీట్లను కైవసం చేసుకొని కేంద్రంలో బిజెపి, కాంగ్రెస్ యేతర వేదిక ఏర్పరచడం కోసం పార్లమెంట్ ఎన్నికలకు ముందు నుండే దేశంలోని ప్రముఖ నాయకులను కలిసి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు చేశారు.  కానీ ఎన్నికల ఫలితాలు పూర్తిగా వన్ సైడ్ వెలువడి మళ్ళీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడటానికి కావాల్సిన పూర్తి మెజారిటీ సాధించడంతో  ప్రధాని పదవి పై ఆశలు పెంచుకున్న ప్రాంతీయ పార్టీల నాయకుల కలలు కల్లలుగానే మిగిలిపోయి.
కేంద్రంలో బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ స్పీచ్ లు ఉండటం ఆయనకు లాభించలేదు.  పై పెచ్చు బిజెపిని విమర్శించే నేపథ్యంలో "హిందూ గాళ్ళు.. బొందు గాళ్ళు.." అంటూ హిందువులను కించపరాస్తూ ఉపన్యాసాలు చేయడం వలన హిందువులలో అత్యధిక శాతం ప్రజల ఓట్లు బిజెపికి చేరిపోయాయి, అలాగే తెరాస ప్రభుత్వ వ్యతిరేక ఓటు సైతం బిజెపికి అత్యధికంగా చేరి ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు, ఫలితంగా చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా పుంజుకొని నాలుగు స్థానాలను బిజెపి కైవసం చేసుకొని చక్రం తిప్పడానికి "సారు" ఆశించిన "పదహారు"కు గండి కొట్టింది.  పై పెచ్చు స్వయానా ముఖ్యమంత్రి కుమార్తె సీటు గెలుచుకోలేని అవమానకరమైన ఫలితాలను అనుభవించేలా చేశాయి కేసీఆర్ "బొందు గాళ్ళ" మాటలు.  ప్రజా తీర్పును స్పష్టంగా అంచనా వేశామని, బిజెపి కేంద్రంలో మరోసారి అధికారం చేపట్టలేదనే అతి విశ్వాసం తెరాసను బిజెపికి దూరం చేసింది.  కేంద్రంలో ఎవరు అధికారం చేపడతారో అనే అంశాలపై, వెలువడబోయే ఫలితాల పై కిమ్మనకుండా కేంద్ర ప్రభుత్వాలపై వ్యూహాత్మక మౌనాన్ని వహించి, తన ప్రచారం తాను రాష్ట్ర స్థాయిలో మాత్రమే విమర్శలు చేస్తూ ముందుకు సాగిన వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ తన స్థానానికి డోకా రాకుండా ముందస్తు జాగ్రత్తలతో వ్యవహరించడంతో కేంద్రంలో మళ్ళీ అధికార పగ్గాలు చేపట్టిన బిజెపిలో సైతం తనకు ప్రాధాన్యం ఉండేలా పరిస్థితులను తన అదుపులో ఉంచుకోగలిగాడు.  వ్యూహాత్మకంగా వ్యవహరించకుండా వివాదాస్పద వ్యాఖ్యలతో కేసీఆర్ సీట్లు నష్టపోయి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న బిజెపితో సత్సంబంధాలకు దూరమవుతున్నారని భావించవచ్చు.
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల విషయాలకు వస్తే.. "యు" టర్న్ లకు ప్రఖ్యాతి గాంచిన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా ఉన్న తొలినాళ్లలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఏమైనా సంజీవనా? అంటూ, హోదాతో కాదు, ప్యాకేజీ తోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వ్యాఖ్యానించి, బిజెపి ప్రభుత్వ నిర్ణయాలైన నోట్ల రద్దు, జీఎస్టీలను పొగిడేసి.. తర్వాత ప్రభుత్వ టర్మ్ ముగిసే సమయానికి తన స్టాండ్ పై "యు" టర్న్ తీసుకొని హోదా పై బిజెపిని నిలదీస్తూ హోదా కోసం దీక్షలు చేస్తూ హోదా విషయంలో ప్రజా క్షేత్రంలో బిజెపిని ముద్దాయిగా చూపించి, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అంచనా వేసి, కాంగ్రెస్ తో జట్టు కలిపి ఎన్నికల గోదాలోకి దిగారు.  బాబుగారి యు టర్న్ లు, రాష్ట్ర రాజకీయాలకు అంతగా అనుభవం లేని బాబు పుత్రరత్నం లోకేష్ చేతిలో రాష్ట్రాన్ని పెట్టేసి ఆయన ఢిల్లీ రాజకీయాల పై దృష్టి కేంద్రీకరిస్తారేమో నేనే ఆంధ్ర ప్రజల సందేహాలు,  స్థిరమైన పట్టుదల, ధ్యేయంతో ఐదు సంవత్సరాలుగా ఓదార్పు యాత్రలు, పాద యాత్రల పేరుతో జనాల మధ్య గడిపిన వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిని ఆంధ్ర ప్రజలు తమ ముఖ్యమంత్రిగా ఎంచుకునేలా చేస్తూ తెదేపాకు కనీస గౌరవ ప్రదమైన సీట్లు సైతం దక్కకుండా చేశాయి.  బాబు వేసిన అంచనాలు తలకిందులుగా మారి కేంద్రంలో కాంగ్రెస్ కు అతి తక్కువ సీట్లు దక్కి మళ్ళీ బిజెపి స్వతంత్రంగా అధికారం చేపట్టడం బాబు మరియు ఆయన అనుచర గణం నేర్చుకోవాల్సిన గుణపాఠాలెన్నో ఈ ఎన్నికలు వదిలేసి వెళ్లాయి.  ప్రత్యర్థి బలాన్ని తక్కువగా అంచనా వేయడం, రాజకీయ అంశాలపై అతిగా "యు"టర్న్ లు తీసుకోవడం, మనమేది చేసినా, ఏది చెప్పినా ప్రజలలో చెల్లుబాటు అవుతుందని అతిగా విశ్వసించడం, స్థిరమైన స్టాండ్, స్థిరమైన విధానం లేకపోవడం వలన మొదటికే మోసమొస్తుందని ఈ ఎన్నికలు నిరూపించాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే చెందిన సినీ నటుడు పవన్ కళ్యాణ్ కొత్త పార్టీ గత ఎన్నికల్లో తెదేపాకు మద్దతు పలికి ఎన్నికల్లో పోటీ చేయకుండా మంచి పనే చేసింది.  అయితే గడిచిన ఐదేళ్లలో పవన్ తన పార్టీ "జనసేన"ను తన అభిమానులకు మాత్రమే పరిమితం చేయకుండా ప్రజలలోకి పార్టీ విధి విధానాలను తీసుకెళ్లడంలో విఫలమవడం, అధికార పార్టీ వైఫల్యాలు కోకొల్లలుగా ఉన్నప్పటికీ వాటిపై స్పందించకుండా ప్రతిపక్షం పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడం, తన పార్టీ విధి విధానాలు ఏ వేదిక పై కూడా స్పష్టంగా ప్రజలకు తెలియజేయలేకపోవడం.  రాష్ట్రానికి, ప్రజా సమస్యలకు సంబంధం లేని చేగువేరా గాధలు, శ్రీ శ్రీ సూక్తులు, తమిళ, ద్రావిడ, ఉత్తర భారత, దక్షిణ భారత వేర్పాటువాద వ్యాఖ్యలు, తెలంగాణాలో ఆంధ్ర వాళ్ళను కొడుతున్నారని, తెలంగాణ వచ్చినప్పుడు తాను అన్నం తినడం మానేశానని ఉభయ రాష్ట్ర సంబంధాలకు, ప్రజలలో ఐకమత్యానికి భంగం వాటిల్లే వ్యాఖ్యలు, రాష్ట్ర ప్రత్యేక హోదా సాధనకు ప్రత్యేక ప్రణాళికలు ఏమి అమలు చేయకపోవడం, ప్రజా సమస్యలకు సంబంధంలేని ఆవేశపూరిత ఉపన్యాసాలతో తన అభిమానులను మాత్రమే ఎంటర్టైన్ చేయగలిగాడు తప్పితే సగటు ఓటరును ప్రభావితం చేయలేకపోయి పార్టీ అధ్యక్షుడైన తాను కూడా రెండు స్థానాలలో సైతం ఓటమి చవి చూసి ఘోర పరాభవం మూటగట్టుకున్నారు.  పార్టీలో రాష్ట్రం మొత్తం మీద ఒక స్థానాన్ని (రాజోలు నియోజకవర్గం) అతి కష్టంగా గెలుపొందగలిగాడు.  అయితే, మరో ఐదు సంవత్సరాలు గతంలో చేసిన తప్పులనే మళ్ళీ చేయకుండా ప్రజా సమస్యల పై దృష్టి పెట్టి, అధికార ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ఎండగట్టుతూ, ప్రజల మద్దతు, సానుభూతిని సంపాదిస్తూ, నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ, స్థిరమైన విధానం, నినాదంతో తనకు అధికారం అందిస్తే తాను ప్రజాభివృద్ధి కోసం చేయబోయే కార్యక్రమాలను ప్రజలకు తెలుపుతూ 2024 వరకు నిత్యం ప్రజా క్షేత్రంలో గడిపితే తప్పకుండా పరిస్థితులు ఆశాజనకంగా మారి పవన్ కళ్యాణ్ జనసేన ఏపీ రాజకీయాలలో ప్రముఖమైన పాత్ర పోషించే అవకాశాలు లేకపోలేదు.  కానీ స్థిరత్వం, నాయకత్వ లక్షణాలు 2024 వరకు ప్రజా క్షేత్రంలో గడపడం, ప్రజలలో నమ్మకాన్ని సాధించడంలో పవన్ ఎంతమేర సఫలీకృతం కాగలదనేది కాలమే నిర్ణయిస్తుంది.
ఇక కేంద్రంలో 2014 కంటే 2019 ఎన్నికల సమయానికి రాహుల్ గాంధీ చాలా పరిణతి చెందారని చెప్పాలి, అతి ధృడమైన మోడీ మానియాను రాహుల్ గాంధీ ఎదుర్కోవలిసి రావడం రాహుల్ ను ప్రధానిగా చూడాలనుకునే సగటు కాంగ్రెస్ అభిమానులకు దురదృష్టకరమే..  ధృడమైన శత్రువు ఎదురుగా ఉన్నప్పటికీ పోరాట పటిమ కనబరిచి సాధ్యమైనంత మేర పోరాడి కొంత పరిణతిని సంపాదించాడు రాహుల్ గాంధీ.  అలాగే 2014 ఫలితాలతో పోల్చుకుంటే 2019 కాంగ్రెస్ సీట్లలో కొంత అభివృద్ధి సాధించగలిగారు.  నిరుత్సాహ పడకుండా ఇదే పోరాట స్పూర్తితో ముందుకెళ్తే రాహుల్ గాంధీకి ఒక అవకాశం ఇవ్వాలనే తలంపు, సానుభూతి దేశ ప్రజలలో జనించి 2024 మెరుగైన ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి.

మొత్తం మీద అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి అన్నట్లుగా 2019 ఎన్నికల ఫలితాలు కొందరి ఆశలను అడియాశలు చేసేసి, కొందరు అనుభవజ్ఞులైన రాజకీయ పండితుల అంచనాలను తలక్రిందులు చేసేసి, అన్ని రాజకీయ పక్షాలకూ పాఠాలు నేర్పాయి.  ఈ అనుభవాలను పరిగణనలోకి తీసుకొని నిర్దిష్టమైన కార్యాచరణ రచియించి ముందుకుసాగుతే రాబోయే రోజుల్లో మెరుగైన ఫలితాలు రాబట్టుకునే అవకాశాలు ఉన్నాయి.



See Also: Srinivas, Gundoju, Article, Indian, Political, Politics, Elections, 2019, Results, Analysis, Telugu, GS,